6, మార్చి 2014, గురువారం

తరాలు-అంతరాలు 2

ఈ టపాలకి తరాలు అంతరాలు అనే శీర్షిక పెట్టడానికి ఒక కారణం ఉంది. పైన చెప్పిన వీరందరూ కూడా మారుతున్న సామాజిక పరిస్తితులకి అనుగుణంగా తమని తాము మార్చుకుని ఉన్నంతలో తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారు.  స్త్రీని వంటింటికి పరిమితం చేసిన పాతతరం నుంచి,  అన్ని రంగాల్లో రాణించి మగవారికి ఏ మాత్రం తీసిపోమని నిరూపించిన నేటి తరం వరకు ఉన్న విభిన్న మజిలీలకి చెందిన వారు ఉన్నారు. నిన్న అమ్మమ్మ, పెద్దమ్మక్కయ్య, అమ్మ ల గురించి వివరించాను. ఇవాళ  మిగిలిన వారి గురించి ముచ్చటిస్తాను. 

విజయ భారతి (బన్ని పిన్ని)  

మేమందరం బన్ని పిన్నీ అని ప్రేమగా పిలుచుకునే మా పిన్నిగురించి చెప్పాలంటే ఎన్ని పేజీలయినా చాలదు. ఇలాంటి అమ్మ ఉంటే బిడ్డలు సాధించని విజయం ఉండదు. పిల్లల ఉన్నతి కోసం, వారి చదువుల కోసం, కోరికల కోసం ఈమె చేసిన త్యాగాలు అసామాన్యమ్. తాము ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కుడా అవేవీ కనీసం పిల్లల మనసుల దరిదాపులకి కూడా రానీయకుండా జాగ్రత్తపడింది మా పిన్ని. కష్టాలన్నీ తమవి, సుఖాలు మాత్రం బిడ్డలవి అనే భావనతో సాకింది ఆ మహాతల్లి.  అంకితభావంతో అత్తింటి వారికి సేవ చేస్తూనే, ఒక తల్లిగా తన బిడ్డలని తీర్చిదిద్దడంలో, వారి అవసరాలు ఆకాంక్షలు నెరవేర్చడంలో ఎటువంటి లోటూ రానివ్వలెదు. ఒకానొక సమయంలో అందని ఎత్తులకి ఆశ పడుతున్నావని బంధువర్గం అందరి నుంచి విమర్శలు ఎదుర్కుని కూడా, ధైర్యంగా నిలబడి ఒంటరి పోరాటం చేసి తనని తాను నిరూపించుకుంది.  అటువంటి అమ్మ దొరకడం ఎన్నో జన్మల పుణ్యఫలం.  తన పిల్లలని ఎవరూ పల్లెత్తు మాట అనకుండా చూసుకునే పిన్ని, తప్పు చేసిన పిల్లలకి బుద్ది చెప్పే పధ్ధతి కూడా ఎంతో విలక్షణంగా ఉండేది.  నేనయితే నా బిడ్డని ఈమెలా పెంచగలిగితే చాలు అనుకుంటాను.    

అనూరాధ, విజయ శారద (రాధ పిన్ని- శారు పిన్ని)   

మాతృదేవోభవ అనే సూక్తికి నిలువెత్తు నిదర్శనం మా పిన్నులు.  వారు తమ జీవితంలో తల్లికి ఇచ్చిన ప్రాధాన్యత వేరెవరికీ ఇవ్వలెదు.  చిట్టచివరి సంతానంగా అందరికన్నా ఎక్కువ సమయం పుట్టినింట్లో గడిపి, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుని, ఏ మగపిల్లలకి తీసిపోమని తల్లితండ్రుల బాధ్యత, నడవలేని అక్కయ్య బాధ్యత కూడా స్వీకరించిన స్త్రీముర్తులు. అమ్మని ఎలా ప్రేమించాలి అనేది వీరి నుంచే నేర్చుకోవాలి ఎవరైనా.  బాల్యమంతా దుర్భరమైన ఆర్ధిక ఇబ్బందులలో గడిచినా, చదువులో, ఆట-పాటలలో అన్నింట్లో మేటిగా గుర్తింపు పొంది తల్లితండ్రులకి గర్వకారణం అయ్యారు.  కన్నతల్లి కంట కన్నీరు వీరు చూడలేరు.  తల్లితండ్రుల కోసం, కుటుంబ బాధ్యత కోసం వీరు తమని తాము త్యాగం చెసారు. తమ సరదాలు సంతోషాలు మాని తల్లితండ్రుల సంతోషమే తమ ధ్యేయంగా జీవితం సాగించారు.  ఆత్మాభిమానానికి మారుపేరుగా అత్తింట్లో కూడా మంచి పేరు తెచ్చుకుని నలుగురికీ ఆదర్శం అయ్యారు.          

ఇంకో రెండు రోజుల్లో రాబోతున్న మహిళా దినోత్సవం సందర్భంగా నా జీవితంలో ఆదర్శప్రాయులైన స్త్రీ మూర్తులకి నా హృదయపూర్వక పాదాభివందనాలు సమర్పిస్తూ ముగిస్తున్నాను.  


5, మార్చి 2014, బుధవారం

తరాలు-అంతరాలు 

ఇప్పుడు నేను ఈ టపా రాయడానికి ఒక ముఖ్య కారణం ఉంది.  నా జీవితంలో ఆదర్శప్రాయులై నిలిచిన స్త్రీ మూర్తులు వారి వారి ఔన్నత్యం, వారు నాకు ఏ విధంగా ఆదర్శం అని చెప్పడానికి ఈ చిన్న ప్రయత్నమ్. ముందుగా మా అమ్మమ్మ గారి కుటుంబం గురించే ప్రస్తావించాలి. ఆరుగురు ఆడపిల్లల అమ్మగా, ఎనమండుగురు సంతానాన్ని కన్న తల్లిగా ఆమె తన బాధ్యత నిర్వర్తించిన తీరు అమోఘం.  

సీతా మహా లక్ష్మి (అమ్మమ్మ) 

మా అమ్మమ్మగారు పన్నెండేళ్ళ వయసులో అత్తింట అడుగుపెట్టిన తల్లి లేని బిడ్డ.  అత్త చాటు కోడలుగా మసులుకుంటూ ఇంటెడు బండెడు చాకిరీ చేస్తూ, అత్తా ఆడపడచుల ఆరళ్ళకి నలిగిపోతూ, భర్త దాష్టీకానికి లొంగిపోయి జీవితం సాగించింది. అత్తా మామల ఆస్తి నిస్వార్ధంగా ఆడపడచుకి ధారపోసి, నిరాడంబరమైన జీవితం గడిపింది.  తను కన్నఎనమండుగురు సంతానమే  తనకి ఆస్తి.  గుమాస్తాగిరి చేసే భర్తకి అనుగుణంగా నడుచుకుంటూ, కుటుంబమే తానుగా, తానే కుటుంబంగా బాధ్యతలను నెరవేరుస్తూ తన ఉనికిని మరిచింది. ఎన్ని కష్ట నష్టాల్లోను బిడ్డలని కంటికి రెప్పలా కాచి కాపాడుకుంటూ ప్రేమతో పెంచింది.  జరిగేది, జరగబోయేది అంతా మంచికే అని, అంతా  కర్మ ఫలితమని నమ్మి, కష్టాల్లో కుంగిపోక, సుఖాల్లో పొంగిపోక, తన దుఃఖానికి వేరొకరిని బాధ్యులని చేసి నిందించక ప్రేమ మయమైన, నిష్కల్మషమైన సహనముర్తిగా జీవితాన్ని గడిపింది.  నేటికి ఈమె వయసు 86 సంవత్సరాలు. 

సరళా అన్నపూర్ణ (పెద్దమ్మక్కయ్య)        

పదహారో ఏట అత్తింట అడుగుపెట్టి అనేక ఆరళ్ళు ఓర్చుకుని, ఆరుగురు సంతానానికి తల్లి అయి, భర్తకి, అత్తకి అనుకూలవతిగా, ఉమ్మడికుటుంబ బాధ్యతలు నెరవేర్చి, కాదన్న వారితోనే ఔననిపించుకున్న ఆదర్శమూర్తి.  అనేక ఓడిడుడుకులకి ఓర్చి సంతానానికి చక్కటి బుద్ధులు నేర్పి తీర్చిదిద్దిన మాతృమూర్తి.  సహనానికి మారు పేరుగా, కోపమంటే తెలియని శాంతమూర్తిగా జీవితం గడుపుతున్న ఉత్తమ ఇల్లాలు.  ఒక మంచి కూతురుగా, మంచి కోడలిగా, మంచి ఇల్లాలిగా, మంచి తల్లిగా, మంచి సోదరిగా, ఇప్పుడు అమ్మమ్మా, నానమ్మగా తన బాధ్యతలని విజయవంతంగా నిర్వర్తించిన ఒక స్ఫూర్తి దాత. నిత్యం భగవన్నామ స్మరణతో, పది మంది మంచి కోరుకుంటూ, హితభాషణలు పలుకుతూ, ప్రేమించే కొడుకూ కోడళ్ళ చెంత ప్రశాంతమైన వృద్ధాప్యం గడుపుతూ పదిమందికీ   ఆదర్శప్రాయమైనది.  

పైన చెప్పిన మా అమ్మ అమ్మమ్మలు నిఖార్సయిన పాతతరానికి ప్రతినిధులు. 

విజయలక్ష్మి                     

పాత కొత్త తరాల సంధి కాలానికి ప్రతినిధి మా అమ్మ.  అత్తా కోడళ్ళు అంటేనే ఒకే చూరు కింద ఉండే శత్రువులు అనే అభిప్రాయాన్ని మా అమ్మ - బామ్మల ని చూసి ఎవరైనా మార్చుకొవలసిందే.  అనుభవజ్ఞురాలయిన అత్తగారి కింద తర్ఫీదు పొందిన సుసిక్షితుడైన సైనికునిగా ఎన్నో ఒడిదుడుకుల మధ్య కుటుంబాన్ని సాఫీగా నడిపిన ధీశాలి మా అమ్మ.  ఉన్నదానిలో సంతృప్తి కరమైన జీవితం గడపడం మా అమ్మ ప్రత్యేకత.  ఈమెకి శత్రువులే లేరు అంటే అతిశయోక్తి కాదు. ఈమె దృష్టిలో చెడ్డవారు లెరు, అనాకారులు లేరు.  ప్రపంచం అంతా అందంగా, మనుషులందరూ మంచి వారుగా అనిపిస్తారు మా అమ్మకి. ఈమె నోరు తెరిచి ఎవరినీ దూషించడం నేను వినలెదు. ఇది బాగోలేదు అని దేని గురించయినా చెప్పడం నేను చూడలేదు.  నాన్న కేవలం ఆర్ధిక బాధ్యతలు నిర్వర్తిస్తే, బిడ్డల సంరక్షణ, చదువు సంధ్యల బాధ్యత సమర్దవంతం గా నిర్వర్తించింది మా అమ్మ.  సహనానికి, శాంతానికి, మంచితనానికి, సేవాభావానికి మా అమ్మ ప్రతీక.     

ఇప్పటికి సెలవు. మిగిలిన వారి గురించి రేపు ప్రస్తావిస్తాను.  





7, ఏప్రిల్ 2010, బుధవారం

చరిత్రలో ఈ రోజు

ఇవాళ మా దేశానికి బ్లాక్ డే. ఇవాల్టినుండి వారం రోజులు ఇక్కడ సంతాపదినాలు. ఎటువంటి శుభకార్యాలు జరగవు, హోటల్స్, పబ్బులు లాంటివి నడవవు. ఒకవేళ నడిచినా ఎలాంటి సంగీతం వినపడకూడదు. ఎట్లాంటి హడావిడి చేయకూడదు. అసలు ఎందుకిలా అంటే "ప్రపంచ చరిత్రలో మా దేశానికి ఒక రుధిరాధ్యాయం ఉంది".

దేశం పేరు రువాండా. కాంగో, ఉగాండా, బురుండి దేశాలు సరిహద్దులుగా ఉన్న తూర్పు / మధ్య ఆఫ్రికా దేశం ఇది. ఇక్కడ రెండు జనాభా మొత్తం రెండు జాతులుగా వర్గీకరించబడినది. పొట్టి వారు మరియు పొడుగు వారు. ఈ ఒక్క జాతి బేధం తప్ప ఎలాంటి అసమానతలు, కొట్లాటలు వీరి మధ్య లేవు. కుల మతాలకి అతీతంగా ఉంటారు. ఆకలి బాధ తప్ప వీరి చేత వేరే ఏ శక్తి తప్పు చేయించలేదు. ఈ రెండు జాతుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగానే ఉండేవి. వారిలో వారికి వివాహ బంధాలు కూడా నడిచేవి. ఒక కుటుంబంలో సమాన సంఖ్యలో రెండు జాతుల వారూ ఉండేవారు. కానీ అధికారం మాత్రం ఎక్కువగా పొడుగువారి అధీనంలో ఉండేది. దేశం లోని ముఖ్యమైన పదవుల్లో పొడుగు జాతి వారే ఉండేవారు. అలాంటి సమయంలో...... ఒక రోజు......

అది 1994 వ సంవత్సరం, ఏప్రిల్ 6 వ తేది, సాయంత్రం సుమారు ఆరుగంటల సమయంలో ఈ దేశ రాష్ట్రపతి జువేనేల్ హబ్యారిమాన (సరి అయిన ప్రినంసేషన్ నాకు తెలియదు) ఎక్కిన విమానం పేల్చివేయబడినది. అది మొదలుకొని వంద రోజుల పాటు అంటే జూలై నెల మూడోవారం దాకా ఇక్కడ జరిగిన దారుణ మారణ హోమం ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ రెండు జాతులు నడిరోడ్డు మీద ఒకరినొకరు నరుక్కోడం మొదలెట్టారు. ఇది ఏ రాజకీయాలకో పరిమితం అనుకునేరు.. కానే కాదు సామాన్య ప్రజల మధ్య జరిగింది. ప్రతీ వాడు ఒక కత్తి పట్టుకుని రోడ్డు మీదికి రావడం ఆ రెండవ జాతి మనిషి ఎవడు కంటబడితే వాడిని నరికి చంపడం. ఇలా వంద రోజుల పాటు జరిగిన నరమేధంలో సుమారు పది లక్షల మంది అసువులు బాసారని ఒక అంచనా.

కుటుంబ సభ్యుల మధ్యలో కూడా ఈ హత్యాకాండ జరిగింది. ఒక భర్త తను పొట్టి వాడు అయి ఉంటే తన కుటుంబంలోని పొడుగువారిని నరికి చంపేవాడు (బంధాలకి అతీతంగా). ఇది స్త్రీలు వృద్ధులు పసి పిల్లలు అని ఎలాంటి తారతమ్యం లేకుండా జరిగిన దారుణం. గర్భిణి స్త్రీలను కూడా నరికి చంపారని ఒక సమాచారం. ఐ.రా.స బలాలు కూడా ఇక్కడ పని చేయలేకపోయాయి. స్వచ్చంద సంస్థలు సైతం గాయపడిన వారికి వైద్యం రహస్యంగా అందిచాల్సిన పరిస్తితి.

ఒక వంక ప్రపంచం అంతా శాంతి మంత్రం జపిస్తూ, వసుధైక కుటుంబ భావనకోసం పాటు పడుతుంటే, ఇక్కడ మాత్రం రోడ్లు, కాలవలు, చెరువులు అన్ని రక్తమయం. ఎక్కడికక్కడ శవాల గుట్టలు, నరికివేయబడ్డ తలలు, కాళ్ళు, చేతులతో భయానకమైన దృశ్యాలు. ప్రపంచలోని ఏ శక్తి ఆ రోజున ఇక్కడ ఈ మారణ హోమాన్ని ఆపలేకపోయింది. ఇందులో ఒకే ఒక మినహాయింపు విదేశీయులు. ఆ సమయంలో ఇక్కడ వివిధ వృత్తుల్లో ఉన్న విదేశీయులని మాత్రం దోపిడీకి పరిమితం చేసి ప్రాణాలతో వదిలేసారు. ఇప్పటికీ ఇక్కడ చిన్నారులకి చరిత్ర పాఠాలు చెపుతుంటే, ఈ దారుణాన్ని విని తట్టుకోలేక స్పృహ తప్పిన ఆ పిల్లలని వైద్యశాల కి తరలించడం నా కళ్ళతో నేను చూసాను. అయితే ఇంతటి నరమేధానికి గల కారణం కేవలం అధికార కాంక్ష అని ఒక అంచనా.

"ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం......
............ నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం"

అయితే వంద రోజులు పూర్తి అయిన తరువాత ప్రస్తుత రాష్ట్రపతి, అప్పటి సైన్యాధికారి అయిన గౌరవనీయులు శ్రీ పాల్ కగామే గారు మొత్తం పరిస్థితిని అధీనంలోకి తెచ్చి శాంతి స్థాపన చేసారు. ఈ జేనోసైద్ తరువాత రువాండా మొత్తం ఆఫ్రికన్ దేశాల్లోనే సురక్షితమైన, శాంతి వంతమైన దేశంగా స్థిరపడింది. ఈ రోజు ఇక్కడ మేము అర్ధ రాత్రి దాటాక కూడా రోడ్ల మీద తిరగచ్చు నిస్సందేహంగా. బహుశా యుద్ధం ముగిసిన తరువాత ప్రశాంతత కావచ్చు.

ఘటనకు సంబంధించిన ఫోటోలు చూడాలనుకుంటే గూగుల్ సెర్చ్ లో రువాండన్ జేనోసైడ్ అని చూడొచ్చు. అంతటి భయంకరమైన దృశ్యాలు బ్లాగులో ఉంచడం మనస్కరించలేదు, అందుకే నేను పెట్టలేదు.

27, మార్చి 2010, శనివారం

ఎప్పుడైనా చూసారా ??????


ఈ వారంలో నేను మొత్తం మూడు మామిడి పండ్లు తిన్నాను. మూడింటిలోనూ ఒక విచిత్రం చూసాను. మొదటి రెండు పండ్లు చూసినపుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ... మూడో పండు కూడా అలాగే ఉండే సరికి ఇక అందరికీ చెప్పక తప్పదు అనిపించింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.... పండు పైకి చక్కగా మంచి రంగుతో, సువాసనతో అతి సామాన్యంగా ఉంది. కానీ లోపల టెంక మొలకెత్తి ఉంది. పండు రుచిలో గానీ రూపంలో గానీ రంగులో గానీ ఎలాంటి తేడా లేదు. అంతా బాగుంది కానీ ఈ టెంక పండు లోపలే మొలకెత్తడం అన్నది నేను ఇప్పటి దాకా ఎప్పుడూ చూడలేదు.


నేను తీసిన మూడవ పండు ఫోటోలు ఇక్కడ ఉంచుతున్నాను. నేను ఎప్పుడూ చూడలేదు కాబట్టి కొత్తగా, వింతగా ఫీల్ అవుతున్నాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి పండుని చూసి ఉంటే నాకు చెప్పండి. నేను ఎంచక్కా ఆ పండు గుజ్జంతా తినేసి టెంకలు మాత్రం మా ఆవరణలో నాటాను. ఒకటి చిన్నగా మొలక కూడా వచ్చింది భూమి పైకి.











15, మార్చి 2010, సోమవారం

ఈ బ్లాగు ఎందుకు???

ముందుగా అందరికి వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ జీవితాలలో సుఖ సంతోషాలను కురిపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

ఇక నేను ఈ బ్లాగు ఎందుకు మొదలెట్టానో చెప్పాలి కాబట్టి.....


ప్రతి రోజు మన కళ్ళకి అంత్యంత సహజంగా, అతి సామాన్యంగా కనిపించే విషయాలు కొన్ని సార్లు మాత్రం చాలా అసహజంగా కనిపిస్తూ అసంతృప్తి రేపుతాయి. అదిగో ఆ కొన్ని సార్లు నా మనసులో మెదిలే భావాలు, నా ఆలోచనలు మీ అందరితో పంచుకోడానికి ఈ బ్లాగు మొదలుపెట్టాను.

ధన్యవాదములు

8, అక్టోబర్ 2009, గురువారం

స్వర్ణమల్లిక

బ్లాగ్ లోకంలోని అందరికి నా శుభాకాంక్షలు. స్వర్ణానికి సుగంధం అద్దితే బాగుంటుంది కదూ. అందుకే నా బ్లాగ్ పేరు స్వర్ణమల్లిక. నా ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోడానికి ఈ బ్లాగ్ మొదలుపెడుతున్నాను. త్వరలో నా మొదటి టపాతో కలుస్తాను.

ధన్యవాదములు

ఉమ